Bible reader



నిర్గమకాండం

గ్రంథకర్త

సంప్రదాయికంగా ఈ పుస్తకం రచయిత మోషే అని చెబుతారు. దైవ ప్రేరణతో ఈ పుస్తకం మోషే రాశాడని అంగీకరించడానికి రెండు మంచి కారణాలున్నాయి. మొదటిది, మోషే ఈ వ్రాత పనిలో ఉన్నాడని నిర్గమకాండం గ్రంథమే చెబుతున్నది. నిర్గమ 34:27 లో దేవుడు “ఈ వాక్యములను వ్రాసికొనుము” అని మోషేతో చెప్పాడు. మరొక చోట మోషే దేవుని ఆజ్ఞ పాటించి “మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి” అని ఉంది. నిర్గమ కాండంలోని మాటలను మోషే రాశాడని ఈ వచనాలను బట్టి భావించడం సమంజసమే. రెండవది, నిర్గమకాండంలో వర్ణించిన సంఘటనలన్నిటినీ మోషే చూశాడు, పాల్గొన్నాడు కూడా. అతడు ఫరో ఇంటిలో విద్యాభ్యాసం చేశాడు. ఆ విధంగా వీటిని రాయడానికి సామర్థ్యం అతనికి ఉంది.

రచనా కాలం, ప్రదేశం

ఇంచుమించు క్రీ. పూ 1450 - 1410

ఈ తేదీకి ముందు ఇశ్రాయేలీయులు తమ అపనమ్మకం మూలంగా అరణ్యప్రదేశంలో 40 సంవత్సరాలు తిరుగులాడారు. ఈ గ్రంథరచన ఈ సమయంలో జరగడానికి అవకాశం ఉంది.

స్వీకర్త

ఈజిప్టు వదిలి బయట వచ్చిన తరమే మొదటిగా ఈ గ్రంథాన్ని అందుకున్నది. (నిర్గమ 17:14; 24:4; 34:27-28).

ప్రయోజనం

ఇశ్రాయేలీయులు యెహోవా ప్రజలు ఎలా అయ్యారు, అనే వైనాన్నినిర్గమ కాండం వివరిస్తున్నది. ఆ జాతి దేవుని ప్రజలుగా జీవించేందుకు పాటించవలసిన నిబంధన నియమాలు ఇందులో వితరంగా రాసి ఉన్నాయి. ఇశ్రాయేలుతో నిబంధన స్థిరపరచిన విశ్వసనీయుడైన, మహాబలవంతుడైన, రక్షణకర్త, పవిత్రుడు అయిన దేవుణ్ణి నిర్గమకాండం ఆవిష్కరిస్తున్నది. దేవుణ్ణి నామం మూలంగా ఆయన చర్యల మూలంగా దేవుని వ్యక్తిత్వం వెల్లడి అయింది. ఇదంతా దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం (ఆది 15:12-16). ఆయన చేసిన వాగ్దానం అబ్రహాము సంతతిని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించటంలో నేరవేరింది అని చూపించడానికే గాక ఒక కుటుంబం ఎంపిక అయిన జాతిగా ఎలా రూపొందింది అని వివరించే కథ ఇక్కడ ఉంది. (నిర్గమ 2:24; 6:5; 12:37). ఈజిప్టు విడిచి వెళ్ళిన హెబ్రీయిల సoఖ్య బహుశా 20 నుంచి 30 లక్షల వరకు ఉండవచ్చు.

ముఖ్యాంశం

విమోచనం

విభాగాలు

1. ముందు మాట — 1:1-2:25

2. ఇశ్రాయేల్ విమోచనం — 3:1-18:27

3. సీనాయి దగ్గర ఇచ్చిన మాట — 19:1-24:18

4. దేవుని రాజ మందిర గుడారం — 25:1-31:18

5. తిరుగుబాటు మూలంగా దేవుని నుండి వైదొలగడం — 32:1-34:35

6. దేవుని గుడారం కూర్పు — 35:1-40:38